సహాయక చర్యలకు అండగా ఉంటాం: రిలయన్స్
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ దంపతులు సానుభూతి తెలిపారు. అక్కడ కొనసాగుతోన్న సహాయక చర్యలకు సాయం చేయడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ రిలయన్స్ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదం తననెంతో కలచివేసిందని అంబానీ దంపతులు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు.
‘‘అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం చూసి మాతో పాటు రిలయన్స్ కుటుంబం మొత్తం ఆవేదనకు గురైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. ప్రస్తుతం అక్కడ కొనసాగుతోన్న సహాయక చర్యలకు రిలయన్స్ మద్దతు ఇస్తుంది. సాధ్యమైనంత వరకూ అన్నివిధాలా సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. బాధితులకు జరిగిన నష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’’ అని ముఖేశ్ దంపతులు తెలిపారు.
గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలడంతో మరో 24 మంది మృతి చెందారు. ఈ విషాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Leave A Comment