పది నిమిషాల ఆలస్యం.. ఆమె ప్రాణాలను నిలబెట్టింది
అహ్మదాబాద్ :
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. భారీ ట్రాఫిక్లో ఇరుకున్న ఆమె అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ఘటన గురించి తలుచుకుంటుంటే తన శరీరం ఇంకా వణుకుతోందని చెప్పారు. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని పేర్కొన్నారు.
లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చారు. తిరిగి వెళ్లేందుకు ఎయిరిండియా ఫ్లైట్ ఏI171లో టికెట్ బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. దీంతో పదినిమిషాలు ఆలస్యమై ఆమె విమానం మిస్ అయ్యారు. ఆ తర్వాత కాసేటికే ప్రమాదం వార్త తెలిసింది. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి భూమి చౌహాన్ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు చేశారు.
‘‘పదినిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసి షాకయ్యా..! ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. నా గణపతి బప్పే నన్ను కాపాడాడు’’ అని భూమి చౌహాన్ పేర్కొంది.
ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో నిర్ణీత బోర్డింగ్ సమయం కంటే ఆమె పది నిమిషాలు ఆలస్యమయ్యారు. దీంతో ఆమె విమానం ఎక్కలేకపోయారు. ఫ్లైట్ మిస్ అవడంతో మధ్యాహ్నం 1.30 గంట సమయంలో ఆమె సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఎనిమిది నిమిషాలకు అంటే మధ్యాహ్నం 1.38 గంటలకు విమానం టేకాఫ్ అయ్యి.. కొన్ని క్షణాలకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం AI171 టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 241 మంది మృతి చెందగా.. ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడడంతో 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ కూడా ఉన్నారు.
Leave A Comment